పార్లమెంటులో స్వతంత్రంగా వ్యవహరిస్తాం: టిడిపిపి
హైదరాబాద్: వచ్చే పార్లమెంటు వర్షాకాలం సమావేశాల్లో స్వతంత్రంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నివాసంలో సమావేశమైన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసింది. జాతీయ, ప్రాంతీయ సమస్యలపై పార్లమెంటులో స్వతంత్రంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు టిడిపిపి నేత కె. ఎర్రంనాయుడు సమావేశానంతరం ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. వోక్స్ వ్యాగన్ కుంభకోణాన్ని, ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును, రాజోలిబండ మళ్లింపు పథకం వద్ద కర్ణాటక ప్రభుత్వం కోసం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు నిర్మిస్తున్న మినీ విద్యుత్ ప్రాజెక్టును పార్లమెంటులో తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. మహిళా రిజర్వేసన్ బిల్లు కోసం తాము పట్టుబడుతామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో సంభవిస్తున్న ఆకలిచావుల గురించి, ఆత్మహత్యల గురించి ప్రస్తావిస్తామని ఆయన అన్నారు.