గురుగావ్లో ఉద్రిక్తత: దద్ధరిల్లిన పార్లమెంటు
న్యూఢిల్లీ/ గురుగావ్: హర్యానా రాష్ట్రంలోని గురుగావ్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా సివిల్ ఆస్పత్రి వద్ద ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రతిగా పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి గురుగావ్కు అదనపు బలగాలను తరలించారు. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ కార్మికులపై పోలీసులు సోమవారం భాష్పవాయువు ప్రయోగించారు, లాఠీచార్జి చేశారు. ఈ లాఠీచార్జితో అనేకులు గాయపడ్డారు. గాయపడినవారిని సివిల్ ఆస్పత్రిలో చేర్చారు. గాయపడినవారిలో దాదాపు 50 మంది ఆచూకీ తెలియడం లేదని అంటున్నారు. కనిపించనివారి గురించి తమకు ఏమీ తెలియదని పోలీసులు, ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో కార్మికుల బంధువుల్లో ఆందోళన పెరిగింది.
గురుగావ్ అల్లర్ల సంఘటన మంగళవారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. గురుగావ్ సంఘటన జలియన్వాలా బాగ్ ఉదంతాన్ని గుర్తు చేస్తోందని నితీష్కుమార్ అన్నారు. గురుగావ్ ఘటనపై న్యాయవిచారణ జరిపించే అంశం తమ పరిధిలోది కాదని హోం మంత్రి శివరాజ్ పాటిల్ పార్లమెంటులో చెప్పారు. ఆ మేరకు హర్యానా ప్రభుత్వానికి సూచన చేయగలనని ఆయన అన్నారు. గురుగావ్ ఘటనలో 92 మంది గాయపడ్డారని ఆయన చెప్పారు. పూర్తి సమాచారం అందిన తర్వాత మరో ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు.
మంత్రి ప్రకటనతో సంతృప్తి చెందని భారతీయ జనతా పార్టీ (బిజెపి), వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. ఆగస్టు 1వ తేదీన విద్రోహదినంగా పాటించాలని వామపక్షాలు నిర్ణయించాయి. గురుగావ్ ఘటనపై న్యాయవిచారణ సరిపోదని ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె. అద్వానీ అన్నారు. హర్యానా ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ లాంటి సంస్థతో గురుగావ్ ఘటనపై విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల సంస్థ హర్యానా ప్రభుత్వానికి సూచించింది.