ఏజెన్సీ మరణాలపై టిడిపికి లేదు: రోశయ్య
విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా మరణాలపై తెలుగుదేశం పార్టీకి స్పష్టత లేదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి కె. రోశయ్య అన్నారు. ఆయన మంగళవారంనాడు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. మలేరియాతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఐదుగురు మాత్రమే మరణించారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోబట్టే మరణాల సంఖ్య తగ్గిందని ఆయన అన్నారు.
మలేరియాతో ఏజెన్సీ ప్రాంతాల్లో 1960 మరణాలు సంభవించాయని మొదట, 936 మరణాలు సంభవించాయని ఆ తర్వాత తెలుగుదేశం నాయకులు చెప్పారని అంటూ మరణాలు పెరుగుతాయా, తగ్గుతాయా అని ఆయన అడిగారు. దీన్ని బట్టే ఎవరు రాజకీయం చేస్తున్నారో, ఎవరు కక్కుర్తి పడుతున్నారో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ఏజెన్సీ మరణాలపై తెలుగుదేశం పార్టీ మానవ హక్కుల కమీషన్కు నివేదించినా తమకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాజకీయం చేయడం తప్ప గిరిజనులకు మేలు చేయాలనే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. గోరంతలను కొండంతలు చేయడం టిడిపికి అలవాటుగా మారిందని ఆయన అన్నారు.