పుకార్లతో తొక్కిసలాట: 18 మంది మృతి
ముంబాయి: ముంబాయి శివార్లలోని మురికివాడలో చెలరేగిన వదంతుల వల్ల సంభవించిన తొక్కిసలాటలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. ముంబాయి శివార్లలోని నెహ్రూనగర్, సుభాష్నగర్లలో వదంతులు ప్రచారం చేయడం ద్వారా ప్రజలను ఆందోళనకు గురిచేసి తొక్కిసలాటకు కారణమైన 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండు ప్రాంతాల్లో వదంతులను ప్రచారం చేసిన 17 మందిని అరెస్టు చేశామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమీషనర్ ఎ.యన్. రాయ్ చెప్పారు. రిజర్వాయర్ తెగిపోయిందని, సునామి ముప్పు వాటిల్లబోతోందని కొంతమంది పుకార్లు ప్రచారం చేశారు. ఈ సంఘటనలో ఆరుగురు పిల్లలు, ఏడుగురు మహిళలతో పాటు మొత్తం 18 మంది మరణించారు. నిన్న 16 మంది మృత్యువాత పడగా శుక్రవారంనాడు మరో ఇద్దరు మరణించారు. మహారాష్ట్రలో సంభవించిన భారీ వర్షాలకు ఇప్పటివరకు 696 మంది మరణించారు. సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి.