ఎన్నికల వాయిదాకు టిడిపి ప్రయత్నం: రఘువీరా
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల వాయిదాకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. 38 శాతం సీట్లు మాత్రమే కేటాయించి వెనకబడిన తరగతులకు (బిసీలకు) ప్రభుత్వం అన్యాయం చేస్తోందనే విమర్శను ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యతిరేకించారు. జనాభా లెక్కల ప్రకారం బిసీలకు సీట్ల కేటాయింపు జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
బిసిలకు అన్యాయం జరిగిందంటూ మొసలికన్నీరు కారుస్తూ తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయించడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆన్నారు. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా తాము బిసీలకు అధిక స్థానాలు ఇస్తున్నామని, బీసీలపై ప్రేమ వుంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చుకోవచ్చునని ఆయన అన్నారు. బీసీలకు స్థానాలు ఎక్కువ ఇచ్చుకుంటామంటే తెలుగుదేశం పార్టీని కాదనేవారెవరని ఆయన అడిగారు.