వైయస్ రావాలి: టిడిపి - రారు: మంత్రి
హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ( ఎస్సి) రిజర్వేషన్ల వర్గీకరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు ఢిల్లీ వెళ్లే అఖిల పక్ష బృందంతో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాబోరని మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తరఫున తాను అఖిలపక్ష బృందంలో ఉంటానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఫ్లోర్ లీడర్లందరూ అఖిల పక్ష బృందంలో ఉండాలని తాము అనుకున్నామని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి రాకుంటే తాను ఢిల్లీ రాబోనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారని, చంద్రబాబు రాకుంటే మరొకరిని పంపవచ్చునని ఆయన అన్నారు. చంద్రబాబు తన తరఫున మరొకరిని ఢిల్లీకి పంపినా ఫరవా లేదని ఆయన అన్నారు. అఖిల పక్ష బృందాన్ని తీసుకొని వెళ్లేందుకు ప్రభుత్వం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు, యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీకి లేఖలు రాసిందని, వారు సమయం ఇవ్వగానే అందుకు ఏర్పాట్లు జరుగుతాయని ఆయన చెప్పారు.
ఢిల్లీ వెళ్లే ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి నాయకత్వం వహించాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణపై ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎం ఆర్పియస్, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నా రాజశేఖర్ రెడ్డి ఢిల్లీకి రాకపోవడానికి కారణాలేమిటో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత సమస్య కాబట్టి దళితులను పంపాలనుకుంటున్నారా, అంటరానివారి సమస్య కాబట్టి అంటుకోకూడదనుకుంటున్నారా అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.