ప్రభుత్వానికి మా తడాఖా చూపిస్తాం: జెఎసి
హైదరాబాద్: వేతన సవరణ సంఘం (పిఆర్సి) సమస్యను పరిష్కరించకపోతే తమ తడాఖా చూపిస్తామని ఉపాధ్యాయ, కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సమితి చైర్మన్ సుబ్బారావు, నేతలు బి.వి. మోహన్ రెడ్డి, గోనారెడ్డి తదితరులు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. తాము ఏ అధికారినీ కించపరచలేదని వారన్నారు.
తమ సమస్యలపై ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాను, ఆ తర్వాత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కలుస్తామని, అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనకు దిగుతామని వారు చెప్పారు. రాంబాబు వేతన సవరణ సంఘం నివేదిక మోసపూరితమైందని వారు విమర్శించారు. పి ఆర్సిలో గత మొత్తంపై 500 కోట్ల రూపాయల కోత పెట్టారని, నిజానికి ఆ కోత 800 కోట్లు ఉంటుందని వారు చెప్పారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా ఇందులో చేర్చి లెక్కలు వేశారని వారు చెప్పారు.