వర్గీకరణకు అఖిలపక్షంతో వైయస్ వెళ్లాలి: మందకృష్ణ
హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల (యస్సి) రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కేంద్రానికి విన్నవించడానికి రాష్ట్రం నుంచి వెళ్లే అఖిలపక్ష ప్రతినిధుల బృందానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్రెడ్డి నాయకత్వం వహించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యంఆర్పియస్) మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కేంద్రానికి విన్నవించే అఖిలపక్ష బృందానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహించకపోయినా, ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టసవరణ బిల్లు తేకపోయినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన మంగళారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తమ డిమాండ్లు నెరవేరకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందని ఆయన అన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద యెత్తున ఉద్యమిస్తామని ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేస్తామని, ఇతర ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన చెప్పారు. యస్సి రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర మంత్రులు జె. గీతారెడ్డి, జి. వినోద్, గొల్లపల్లి సూర్యారావులకు ఇచ్చిన హామీ ఏమిటో వెల్లడించాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.