ఒక్క ఇల్లు కట్టలేదు, వైయస్కు ఇంద్రభవనం: బాబు
ఆదిలాబాద్/నిజామాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గత 14 నెలల కాలంలో సామాన్యుల కోసం ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, తాను మాత్రం ఇంద్రభవనంలాంటి ఇల్లు నిర్మించుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. రోడ్షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రచార బోర్డులకే పరిమితమైందని ఆయన వ్యాఖ్యానించారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తమ పార్టీ సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో సర్దుబాటు ఉండదని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించకపోతే దేవాలయ భూములనే కాదు, ఏకంగా దేవుళ్లనే అమ్ముతుందని ఆయన వ్యాఖ్యానించింది.