నానావతి నివేదికపై పార్లమెంటులో రభస
న్యూఢిల్లీ: నానావతి కమీషన్ నివేదికపై పార్లమెంటు ఉభయసభలు అట్టుడికిపోయాయి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ) సభ్యుల డిమాండ్లతో అల్లరి చెలరేగి పార్లమెంటు ఉభయసభలకు కార్యక్రమాలేవీ చేపట్టకుండానే రేపటికి (బుధవారంనాటికి) వాయిదా పడ్డాయి. 1984 అల్లర్లకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి, అకాలీదళ్ సభ్యులు డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.
మంగళవారం ఉదయం సభలు సమావేశం కాగానే ఎన్డిఎ సభ్యులు లేచి నిలబడి అల్లరికి దిగారు. అల్లర్లకు బాధ్యులైనవారిని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. యన్డిఎ సభ్యులు వెల్లో గుమికూడి అల్లర్లకు బాధ్యులంటూ నానావతి కమీషన్ పేర్కొన్నవారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ ఎంతకూ సద్దుమణగకపోవడంతో లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సభను రేపటికి వాయిదా వేశారు.
రాజ్యసభలో నానావతి కమీషన్ నివేదిక గురించి బిజెపి సభ్యురాలు సుష్మా స్వరాజ్ ప్రస్తావిస్తూ అల్లర్లలో కాంగ్రెస్ మొత్తం పాలు పంచుకున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. అకాలీదళ్కు చెందిన రాజ్ మొహిందర్ సింగ్ మజితా నేతృత్వంలో ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని నిలిపేయాలని కోరుతూ తాము నోటీసు ఇచ్చామని బిజెపి సభ్యుడు ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. అయితే తనకు ఆ నోటీసు అందలేదని చైర్మన్ బైరాన్ సింగ్ షెకావత్ చెప్పారు. మొదట సభను షెకావత్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా సద్దుమణగకపోవడంతో సభను ఆయన రేపటికి వాయిదా వేశారు.
నానావతి కమీషన్ నివేదిక తప్పు పట్టిన మంత్రులందరూ రాజీనామా చేయాల్సిందేనని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ప్రధానిగా మన్మోహన్ సింగ్ కూడా బాధ్యులేనని ఆయన అన్నారు.