వైయస్కు ఎన్నికల జ్వరం: చంద్రబాబు
ఏలూరు: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఎన్నికల జ్వరం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన గురువారంనాడు రోడ్ షో నిర్వహించారు. ముడుపుల కోసమే పోలవరం కాలువలు తవ్వుతున్నారని ఆయన ఆరోపించారు. గత ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ మైనారిటీలను మోసం చేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇస్తోంది రేషన్కార్డులు కాదని ఎన్నికల కార్డులని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ మైనారిటీలను మోసం చేస్తోందని, మున్సిపల్ ఎన్నికలు రావడంతో మైనారిటీలపై లేని ప్రేమను ఒలకబోస్తోందని ఆయన అన్నారు. వెనకబడిన తరగతులను (బిసిలను) మోసం చేసన ఘనత కూడా కాంగ్రెస్కే దక్కుతుందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలను చిన్నచూపు చూస్తోందని, అందుకే బిసి జనాభాను తగ్గించి చూపుతోందని, దీనివల్ల భవిష్యత్తులో బిసి రిజర్వేషన్లు తగ్గే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. బిసి జనాభాను తగ్గించడంలో ప్రభుత్వ దురద్దేశాలేమిటో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
తమ పార్టీలో విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పనిచేసే వారికే పార్టీలో ప్రాధాన్యం వుంటుందని ఆయన చెప్పారు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.