ప్రేమ పేరుతో హత్య చేసిన మధు అరెస్టు
కరీంనగర్: ప్రేమించలేదనే కోపంతో మమత అనే 13 ఏళ్ల అమ్మాయిని హత్య చేసిన మధును పోలీసులు గురువారంనాడు అరెస్టు చేశారు. మధును కఠినంగా శిక్షించాలని కోరుతూ మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మమత సహ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన కల్లెపల్లి మమతను దీకొండ మధు అనే 19 యేళ్ల పురుగుమందు తాగించి హత్య చేశాడు.
మమత రాగంపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. గ్రామంలో జులాయిగా తిరిగే మధు రెండేళ్లుగా ప్రేమ పేరుతో మమతను వేధిస్తూ వస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ వస్తున్నాడు. మమత ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పెద్దమనుషులు మధును పిలిపించి పంచాయతీ పెట్టారు. తన తప్పును ఒప్పుకుని మమత జోలికి వెళ్లనని మధు పెద్ద మనుషుల వద్ద చెప్పుకున్నాడు. అయితే మాటకు కట్టుబడకుండా మమతను వేధించడం కొనసాగించాడు.
ఈ స్థితిలో మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసి తన స్నేహితురాళ్లతో కలిసి మమత బడికి వెళ్తున్న సమయంలో మధు అడ్డగించాడు. తనను పెళ్లి చేసుకోవాలని మధు మమతను బలవంత పెట్టాడు. దీంతో మమత మధును చెంపపై కొట్టింది. దీంతో మధు మరింత రెచ్చిపోయి స్నేహితురాళ్లు అడ్డగించినా వినకుండా మమతను బలవంతంగా తీసికెళ్లాడు. మమతను ఇంటికి తీసికెళ్లి టీవీ సౌండ్ పెంచి ఆమెపై అత్యాచార ప్రయత్నం చేశాడు. మమత ప్రతిఘటించడంతో పురుగు మందు తాగించాడు. ఆ తర్వాత మమతను ఇంట్లో ఉంచేసి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగొచ్చి మమతను ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. ఆమె ఇంటికి వెళ్లి తల్లి కనకవ్వకు విషయం తెలిసింది. వెంటనే మమతను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. మమత కన్నుమూసింది.