సుప్రీం తీర్పు సామాజిక న్యాయానికి దెబ్బ: బాబు
హైదరాబాద్: ప్రైవేట్, మైనారిటీ వృత్తి విద్యాసంస్థలో అడ్మిషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయాన్ని దెబ్బ తీస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానాలను వివరిస్తూ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు లేఖ రాయనున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్, మైనారిటీ వృత్తి విద్యాసంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వాల కోటాలు, రిజర్వేషన్ల విధానం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
బలహీనవర్గాలకు ప్రైవేట్, మైనారిటీ వృత్తి విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల చెల్లుబాటుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ తేవాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విద్యాసంస్థల్లో ఫీజులు కూడా పెరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. బలహీన వర్గాలకు ఏ విధంగా ప్రయోజనం కలిగించాలనే విషయాన్ని ఆలోచించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంస్కరణల ఫలాలు అందుబాటులోకి వచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను తగ్గించాల్సిందేనని ఆయన అన్నారు.