నరేంద్ర మాటలు మంచివి కావు: దత్తాత్రేయ
కరీంనగర్: కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నేత ఎ. నరేంద్ర వాడిన పదజాలం మంచిది కాదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పచ్చి దొంగలని నరేంద్ర చేసిన వ్యాఖ్యను ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. కేంద్ర మంత్రిగా నరేంద్ర ఆ విధమైన భాష వాడడం మంచిది కాదని, తెలంగాణ ఉద్యమానికి ఆ విధమైన పరుష పదజాలం విఘాతం కలిగిస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణ డిమాండ్ భావోద్వేగానికి సంబంధించిన అంశమని, ఇటువంటి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భాష వాడకంలో నిగ్రహం అవసరమని ఆయన అన్నారు. నిందించడం రాజకీయ సంస్కృతి కాదని ఆయన అన్నారు. భాష వాడకంలో నిగ్రహం, జాగ్రత్త అవసరమని ఆయన అన్నారు. మైనారిటీ ఓట్ల కోసం తెలుగుదేశం, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని ఆయన విమర్శించారు. మతప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించడం సరికాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ బాటలోనే నడవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.