మీడియాపై వైయస్ మరోసారి విసుర్లు
హైదరాబాద్: వార్తా పత్రికల తీరుపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలు వార్తలను వక్రీకరిస్తున్నాయని ఆయన శనివారంనాడు అన్నారు. వార్తలను వక్రీకరించడం ఏం న్యాయమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి గానీ వార్తలను వక్రీరించవద్దని ఆయన పత్రికలకు సలహా ఇచ్చారు. తన ప్రసంగాన్ని కూడా పత్రికలు వక్రీకరిస్తున్నాయని ఆయన అన్నారు.
జలయజ్ఞంపై తెలుగుదేశం పార్టీ లేనిపోని విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తాను చేసిన ప్రసంగాన్ని కొన్ని పత్రికలు వక్రీకరించాయని ఆయన అన్నారు. దానిపై వివరణ ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. దాదాపు 40 నిమిషాలు మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఇందులో ఎక్కువ సమయాన్ని మీడియాపై విసుర్లకే సరిపెట్టారు. తెలుగుదేశం పార్టీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని, ప్రాజెక్టులను అప్పుడే నిర్మించి వుంటే అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఉండేది కాదని ఆయన అన్నారు. జగ్గయ్యపేటలో ఈ నెల 11వ తేదీన తాను చేసిన ప్రసంగం వీడియో క్యాసెట్ను ఆయన ప్రదర్శించారు.
రామునితో కపివరండిట్లనియె అని అనడానికి రామునితోక పివరుండిట్లనియె అని అనడానికి మధ్య తేడా ఎంతో ఉందని, ఏది సీరియస్ విషయమో, ఏది వ్యంగ్యమో అర్థం చేసుకుని రాయాల్సి వుంటుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తమ మీద వేసిన నిందలను ప్రస్తావిస్తూ తాను వ్యంగ్యంగా అన్న మాటలను మీడియా సరిగా అర్థం చేసుకోలేకపోయిందని ఆయన అన్నారు.
ఆంధ్ర ప్రజాప్రతినిధులు దొంగలని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నాయకుడు నాయని నర్సింహారెడ్డి ప్రకటన చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. అది నాయని నర్సింహారెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన చెప్పారు. టిఆర్యస్ నాయకుడు కె. చంద్రశేఖర్ రావుతో కుదిరిన ఒప్పందాల్లో దేన్ని కూడా ఉల్లంఘించడం లేదని, నరేంద్ర ఈ దిగ్విజయ్ సింగ్కు ఫిర్యాదు చేయదలుచుకుంటే చేసుకోవచ్చునని ఆయన అన్నారు. పులిచింతల ప్రాజెక్టు స్థలమార్పిడిపై అధ్యయానికి కమిటీ వేశామని ఆయన చెప్పారు.