పోలవరాన్ని పూర్తి చేసి తీరుతాం: వైయస్
ఖమ్మం: గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆయన శనివారం సాయంత్రం రాజీవ్ నగరబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటయిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు మోడల్ కాలనీలు నిర్మిస్తామని, వారికి సాగు భూమి ఇస్తామని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు దక్కేవా అని ఆయన అడిగారు. ప్రాజెక్టులలో అవినీతి పెచ్చరిల్తుతున్నదని విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ ఒక్క ప్రాజెక్టులోనైనా అవినీతి చోటు చేసుకున్నట్లు నిరూపించలేకపోయిందని ఆయన అన్నారు. త్వరలో దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.