బిజెపి ప్రదర్శన: నేతలు, కార్యకర్తలు అరెస్టు
హైదరాబాద్: వచ్చే నెల 17వ తేదీన సెలవు దినాన్ని ప్రకటించి, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) గురువారం హైదరాబాద్లో భారీ ప్రదర్శన నిర్వహించింది. తమ డిమాండ్తో సచివాలయాన్ని ముట్టడించాలని బిజెపి నాయకులు, కార్యకర్తలు నిర్ణయించుకున్నారు. దీంతో బషీర్బాగ్లోని నిజాం కళాశాల మైదానం వద్ద, సచివాలయం వద్ద భారీ యెత్తున పోలీసులు మోహరించారు.
సచివాలయ ముట్టడికి నిజాం కళాశాల మైదానంలోంచి వెలుపలికి వచ్చిన బిజెపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి, శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు సిహెచ్. విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17వ తేదీన స్వాతంత్య్రం సిద్ధించిందని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్యమానికి ఊపు ఇచ్చినట్లవుతుందనే భావనతో ప్రభుత్వం ఈ ఉత్సవాల నిర్వహణకు ముందుకు రాకపోవడం సరైంది కాదని వారన్నారు. ప్రదర్శనకు ముందు నిజాం కళాశాల మైదానంలో సమావేశం జరిగింది.
ప్రదర్శనకు జిల్లాల నుంచి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని, నైజాం పాలనను మరిపించే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విద్యాసాగరరావు విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో 200 మంది బిజెపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. అలాగే వరంగల్ నుంచి హైదరాబాద్కు వస్తున్న కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకున్నారు.