అద్వానీ నాయకత్వంలో పని చేయలేను: ఖురానా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు మదన్లాల్ ఖురానా తాజాగా తిరుగుబాటు ప్రకటించారు. ఎల్.కె. అద్వానీ నాయకత్వంలో పని చేయడం తన వల్ల కాదని ఆయన అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ను సంప్రదించి తన భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటానని ఆయన చెప్పారు.
అద్వానీ చుట్టూ ఉన్న మనుషులతో కలిసి పని చేయడం ఎంతో కాలం పని చేయలేనని, వారు ఎసి గదుల్లో కూర్చొని పార్టీ అధ్యక్షుడి నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఆ మనుషులు ఎవరనేది ఆయన పేర్లు వెల్లడించలేదు. పార్టీని వీడిపోతారా అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆయన జవాబు దాటవేశారు. తాను ఆర్యస్యస్ నాయకులను కలిసి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటానని ఆయన చెప్పారు. అద్వానీ చుట్టూ ఉన్న కోటరీ వల్ల పార్టీ పతనదిశగా పయనిస్తోందని ఆయన అన్నారు.
పార్టీని పటిష్టం చేయడానికి తాము జీవితమంతా ధారపోశామని, పార్టీ పతనాన్ని తాము చూడలేమని ఆయన అన్నారు. ప్రజా బలం ఉన్న నాయకులను పక్కకు పెడుతుండడమే కాకుండా వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఖురానా నెల క్రితం అద్వానీకి ఒక లేఖ రాశారు. పార్టీ సిద్ధాంతాల నుంచి వైదొలిగి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా నడుస్తోందని ఖురానా అన్నారు.