అభివృద్ధే మా లక్ష్యం: వరంగల్లో వైయస్
వరంగల్: తమ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. గురువారంనాడు ఆయన వరంగల్లో రాజీవ్ నగరబాట నిర్వహించారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తామని ఆయన చెప్పారు. వరంగల్లో 22 అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చి వుంటే అభివృద్ధి జరిగి వుండేది కాదని ఆయన అన్నారు. తాము రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.
మావోయిస్టులపై నిషేధం నేపథ్యంలో వైయస్ పర్యటన సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాన్వాయ్ నుంచే ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 2 వేల మంది పోలీసులను భద్రతకు వినియోగించారు. వైయస్ రాకకు ముందు పోలీసులు ఆయన వెళ్లే దారికి ఇరువైపులా ఉన్న అన్ని ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను తనిఖీ చేసి, వాటిని మూసేసి తాళాలు వేశారు. కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు ప్రజాప్రతినిధులను కూడా ఇబ్బంది పెట్టాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను కూడా ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్దకు పోలీసులు అనుమతించలేదు. దీంతో అక్కడ కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జిల్లా యంత్రాంగం జోక్యంతో సమస్య పరిష్కారమైంది.
మీడియా ప్రతినిధులపై ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. దీంతో ఒక కెమెరామన్ గాయపడ్డాడు. వరంగల్లో నగరబాటను ముగించుకున్న ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాలోని జనగాంలో నగరబాట నిర్వహణకు బయలుదేరి వెళ్లారు. వరంగల్లో మీడియా ప్రతినిధులపై దాడికి నిరసనగా జనగామలో మీడియా త్రపినిధులు నల్లబ్యాడ్జీలు ధరించారు.