గుడివాడ సంఘటనపై చర్యకు టిడియల్పి డిమాండ్
హైదరాబాద్/ గుడివాడ: తమ పార్టీ శాసనసభ్యుడు కొడాలి వెంకటేశ్వరరావు (నాని)పై గుడివాడలో డియస్పీ రివాల్వర్ ఎక్కుపెట్టిన సంఘటనపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం శాసనసభా పక్షం స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డిని కోరింది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ సభ్యులు పయ్యావుల కేశవ్, దయాకర్ రావు తదితరులు గురువారం స్పీకర్ను కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యుడిపై రివాల్వర్ ఎక్కుపెట్టి కాల్చి పారేస్తానని బెదిరించిన డియస్సీని డిస్మిస్ చేయాలని కూడా వారు కోరారు. ఒక దళిత కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిలదీసి న్యాయం చేయాలని కోరడానికి వెళ్లిన శాసనసభ్యుడిపై ఆ విధంగా వ్యవహిరంచడం భారత ప్రజస్వామ్యంలో కనీవినీ ఎరుగమని పయ్యావుల కేశవ్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
సంఘటనకు సంబంధించిన వివరాలను తెప్పించుకుని, అవతలి పక్షం నుంచి వివరాలను రాబట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ సురేష్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. శాసనసభ్యుడి విషయంలో అధికారులు ఏమైన ఉల్లంఘనలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధికి భద్రత కల్పించాల్సిన బాధ్యత, ప్రోటోకాల్ పాటించాల్సిన కర్తవ్యం అధికారులపై ఉందని, వాటికి సంబంధించి ఉల్లంఘనలు జరిగితే చర్యలు తప్పవని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, గుడివాడలో 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. నానిపై, మరో 50 మందిపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. మంత్రులను అడ్డుకున్నారని, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారని, పోలీసు కెమెరాను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ వారిపై కేసులు నమోదయ్యాయి. కొడాలి నానిని కూడా అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు స్పీకర్ అనుమతి కూడా అడిగారు. అయితే నాని అరెస్టును ఆ తర్వాత వాయిదా వేసుకున్నారు. గుడివాడలో 144 సెక్షన్ కొనసాగుతోంది.