తృతీయ ఫ్రంట్ను కాదనలేం: చంద్రబాబు
కావలి: దేశంలో తృతీయ రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పరోక్షంగా చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవసరం ఏర్పడితే తృతీయ ఫ్రంట్ ఏర్పాటును తోసిపుచ్చలేమని ఆయన అన్నారు. రాజకీయాల్లో శూన్యం ఏర్పడితే అత్యవసరంగా ఓ శక్తి ఆవిర్భవిస్తుందని ఆయన అన్నారు.
వామపక్షాలతో కలిసి పనిచేసే విషయంపై ఆయన సమాధానం దాటవేస్తూనే ఆ పక్షాలకు అనుకూలంగా మాట్లాడారు. సమాజ్వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తమతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారని ఆయన చెప్పారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని ఆయన అన్నారు. పొత్తులకు తాము ఏమీ ఆతురత పడడం లేదని ఆయన అన్నారు. ఏ ఎన్నికల్లోనైనా తమ పార్టీ సొంతంగానే విజయం సాధించిందని, పొత్తుల వల్ల లాభపడిందేమీ లేదని ఆయన అన్నారు. తాము 35 లోక్సభ సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన సందర్భం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకునేవారు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్పై ఉన్న ప్రజా వ్యతిరేకత వల్ల ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పార్టీలు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.