గృహకల్ప కింద వైయస్కు ఇల్లు: టిడిపి సలహా
హైదరాబాద్/ వరంగల్: రాజీవ్ గృహకల్ప కింద ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఇల్లు మంజూరు చేయాలని, అలా చేస్తే తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాకు ఒక లేఖ రాస్తామని ఆయన మంగళవారం వరంగల్లో చెప్పారు. నిరాంబరత గురించి నీతులు చెప్పవద్దని ఆయన రాజశేఖర్ రెడ్డికి సలహా ఇచ్చారు.
ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఇల్లు లేదని, అందువల్ల రాజీవ్ గృహకల్ప కింద వైయస్కు ఇల్లు కట్టిస్తే తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆయన ఎద్దేవా చేశారు. అయితే వ్యవసాయ క్షేత్రాలు ఎవరివో, ఎస్టేట్లు ఎవరివో, దేశంలోని పవర్ ప్రాజెక్టులు ఎవరివో తేలాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. రాజశేఖర్ రెడ్డి తమపై క్రిమినల్ జోక్స్ వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సియల్పి) విమర్శించింది. తమ ప్రభుత్వ అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డికి లేదని జూపల్లి కృష్ణారావు, తదితర కాంగ్రెస్ శాసనసభ్యులు మంగళవారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అభివృద్ధికి కృషి చేయని నాగం జనార్దన్ రెడ్డికి తమ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు లేదని వారన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, తెలుగుదేశం నాయకులు తమ ప్రభుత్వ హయాంలో పనికి ఆహారం పథకం కింది బియ్యాన్ని దోపిడీ చేశారని, మద్యం విక్రయాల్లో ముడుపులు తీసుకున్నారని వారు ఆరోపించారు. ఏలేరు స్కామ్ వంటి కుంభకోణాలు ఎన్నో జరిగాయని వారన్నారు. ఏదో ఒక ఆరోపణ చేసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వారన్నారు.