టిఆర్యస్ విడిపోతే మాకేం నష్టం లేదు: కెకె
హైదరాబాద్: తాము ఎవరి బలం మీదా ఆధారపడి లేమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) ఒంటరిగా పోటీ చేయదల్చుకుంటే తాము అందుకు సిద్ధమేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. టిఆర్యస్తో పొత్తు లేకపోవడం వల్ల తమ విజయావకాశాలు ఏ మాత్రం దెబ్బ తినబోవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా కలిసి పోటీ చేయాలని తాము అనుకున్నామే గానీ తాము ఒంటరిగా పోటీ చేయలేక కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో మైత్రిని చెడగొట్టడానికి కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేస్తున్న ప్రకటనలను మీడియా వక్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై టి ఆర్యస్ నేత కె. చంద్రశేఖర్రావుతో మాట్లాడుతామని ఆయన చెప్పారు. టి ఆర్యస్తో పాటు ఏ మిత్రపక్షం కలిసి రాకున్నా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు.