ఉత్తరాంధ్రలో లోతట్టు ప్రాంతాలు జలమయం
భువనేశ్వర్/విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయవ్యదిశగా కేంద్రీకృతమైన వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నం వద్ద తీరం దాటింది. వాయుగుండం తుఫానుగా మారింది. ఈ వాయుగుండం నైరుతిదిశగా కదులుతోంది. తుఫాను హెచ్చరిక కేంద్రం అధికార వర్గాలు సోమవారం ఉదయం ఈ విషయాన్ని తెలియజేశాయి.
ఈ వాయుగుండం ప్రభావంతో ఒరిస్సాలోని తీరప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో వచ్చే 39 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు పడే సమయాల్లో సముద్ర తరంగాలు పెద్ద యెత్తున ఎగిసి పడే అవకాశం ఉంది. దక్షిణ ఒరిస్సా తీరప్రాంత ప్రదేశాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. చేపలు పట్టడానికి బెస్తవారెవరూ సముద్రంలోకి వెళ్లకూడదని ఆదేశించారు.
తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కోస్తా తీర ప్రాంతంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. విశాఖపట్నం, కాకినాడ ఓడరేవుల వద్ద ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. వంశధార దిగువ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత కె. ఎర్రంనాయుడు పర్యటించారు. విశాఖపట్నం జిల్లాల్లో చెట్లు కూలి రోడ్లపై పడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. విజనగరం గంటస్తంభం వద్ద విద్యుత్ వైర్లు తెగిపడి ఒక వ్యక్తి మరణించాడు. మత్స్యకారుల పడవలు 30 వరకు నీటిలో మునిగిపోయాయి. 100 మంది జాలర్ల జాడ తెలియడం లేదు.
మరో 24 గంటల పాటు సముద్రంలోకి వెళ్లరాదని విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం మత్స్యకారులను ఆదేశించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కళింగపట్నం వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. కళింగపట్నం సమీపంలోని ఏడు గ్రామాలు నీట మునిగాయి. 47 గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
విజయనగరం జిల్లాలోని సుజాత్నగర్లోని ఇళ్లు నీట మునిగాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఉంది. వంశధార 24 గేట్లు ఎత్తివేసి 50 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. నాగావళి, మహేంత్రతనయ, బహుదా నదులు, వంశధార కుడి, ఎడమ కాలువలు పొంగిపొర్లుతున్నాయి.