రాష్ట్ర ముఖచిత్రం మారుతోంది: వైయస్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయని, ఆ సర్వేలు వెల్లడించినవాటి కన్నా తమకు ఎక్కువ సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. తమ గత 16 నెలలుగా చేపట్టిన కార్యక్రమాల వల్ల రాష్ట్ర ముఖచిత్రం మారుతోందని, రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి దిశలో పయనిస్తోందని, ఇది అనుభవంలోకి వస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ విధానానికి భిన్నంగా పట్టణాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఎపియుడబ్ల్యుజె) గురువారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. హైదరాబాద్లాంటి నగరాల్లో రోడ్లు బాగు చేసి, గ్రీనరీ పెంచి సుందరంగా కనిపించేటట్లు చేసి అభివృద్ధి సాధించామని గత తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకుందని, అయితే తాము అన్ని నగరాల్లో, పట్టణాల్లో సామాన్య పేదల జీవనస్థితిగతుల్లో మెరుగైన మార్పును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు.
పట్టణాల పారిశుధ్యంపై, సమగ్రాభివృద్ధిపై ప్రధానంగా దృష్టికి కేం6దీకరించామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు ప్రాధాన్యం ఇస్తోంది, పట్టణాలను విస్మరిస్తోందేమోననే అనుమానాలను పటాపంచలు చేస్తూ పట్టణాల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. పట్టణాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు, ఆ ఇంటికి మరుగుదొడ్డి, కుళాయి ఉండడమే కాకుండా కుళాయిలో నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించాం. ఇందులో భాగంగా కనీవినీ ఎరుగని రీతిలో గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం పట్టణాల్లోని పేదలకు 2.08 లక్షల పైచిలుకు ఇళ్లు మాత్రమే నిర్మిస్తే తాము ఈ 16 నెలల కాలంలోనే 3.90 లక్షల పైచిలుకు గృహాలు మంజూరు చేశామని ఆయన వివరించారు. రాజీవ్ గృహకల్ప కింద మధ్యతరగతివారికి వాయిదాల చెల్లింపు ప్రాతిపదికపై రుణాలు ఇప్పించి ఇళ్లు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు.
పట్టణాల్లో మంచినీటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. పట్టణాల్లో రోడ్లు, మురికి కాలువల వ్యవస్థ నిర్మాణానికి, మరమ్మతులకు 1200 కోట్ల రూపాయలతో పథకాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పేదలందరికీ తెల్లరేషన్ కార్డులిస్తామని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, తాము గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేం6దీకరించి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం సేద్యపు నీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తాము కనీవినీ ఎరుగని రీతిలో 46 వేల కోట్ల రూపాయలతో 26 పెండింగ్ ప్రాజెక్టులను నిర్మాణం పనులు చేపట్టామని, ప్రాజెక్టుల విషయంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించామని ఆయన చెప్పారు.
తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ముస్లిమ్లకు విద్య, ఉద్యోగరంగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించామని, తాము చేసిన వాగ్దానాలను అమలు చేస్తున్నాం కాబట్టే తమపై ప్రజలకు విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. స్థానిక అభ్యర్థులను తాము మున్సిపల్ ఎన్నికల్లో నిలబెట్టడం ఇప్పటి తమ ప్రత్యేకత అని ఆయన అన్నారు. అన్ని వర్గాలవారికీ ఇచ్చిన హామీలను తాము నిలబెట్టుకున్నామని ఆయన చెప్పారు.
మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారంటే, మహిళలు సాధించిన సాధికారితను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ప్రశంసించారంటే, మన నమూనాలను బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా అడిగి తెలుసుకుంటున్నాయంటే తాము చేపట్టిన కార్యక్రమాలు ఏ విధంగా అభివృద్ధి దిశగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలిత మున్సిపాలిటీలు ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సాధించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.