సమ్మె: ఎపిలో ఆర్థిక కార్యకలాపాల స్తంభన
హైదరాబాద్: దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం రాష్ట్రంలో సమ్మె జరిగింది. సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. జాతీయ బ్యాంకులు, బీమా కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. బ్యాంక్, బీమా కార్యాలయాల ఉద్యోగులు తమ తమ కార్యాలయాల ముందు ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ విధానాలకు నిరసనగా వామపక్షాలు ఈ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. హైదరాబాద్లో భారీ ర్యాలీ జరిగింది.
సమ్మెలో మొదటిసారి విమానయాన సర్వీసుల ఉద్యోగులు పాల్గొన్నారు. దీంతో పలు విమాన సర్వీసులు ఆగిపోయాయి. సమ్మెమ ప్రభావం రైల్వేపై పడలేదు. సికింద్రాబాద్ నుంచి అన్ని రైళ్లు యధాతథంగా నడిచాయి. ఆర్టీసిపై కూడా సమ్మె ప్రభావం పెద్దగా లేదు. కేవలం 15 శాతం బస్సులు మాత్రమే నిలిచిపోయాయి. సింగరేణిలో కూడా పెద్దగా కార్మికులు సమ్మెకు మొగ్గు చూపిన దాఖలాలు లేవు, వరంగల్, కరీంనగర్ జిల్లాలోని మంచిర్యాలల్లో మాత్రమే కొంతమంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. విశాఖ పోర్టులో సమ్మె జరిగింది. రిజర్వ్ బ్యాంక్, ఎస్బిఐ, ఎస్బిహెచ్ వంటి పలు బ్యాంకుల్లో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. హైదరాబాద్, విశాఖపట్నం కార్యాలయాల ముందు బీమా ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు.