రేపటి నుంచి తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుపతి: తిరుమల నవరాత్రి బ్రహోత్సవాలు మంగళవారంనాడు ప్రారంభమవుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రతి రోజూ ఉదయం పూట, రాత్రి ఊరేగిస్తారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు ప్రదానం చేస్తారు. ఈసారి గురడసేవ సందర్భంగా కాకుండా మొదటి రోజే ఆయన పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ వర్గాలు చెప్పాయి. ముఖ్యమంత్రి సందర్శన వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వర్గాలు చెప్పాయి. గరుడసేవ అయిదో రోజు జరుగుతుంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా అదనంగా బస్సులను నడపడానికి ఆర్టీసి ఏర్పాట్లు చేస్తోంది. 70 వేల మంది భక్తుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసి వర్గాలు చెప్పాయి. తిరుమలకు రోజుకు వేయి ట్రిప్పులు బస్సులు నడుస్తాయని, బ్రహ్మోత్సవాల సందర్భంగా అదనంగా 600 ట్రిప్పులు తిరుగుతాయని చెప్పాయి. ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.