కంగారుల చేతిలో వరల్డ్ ఎలెవన్ కంగు
మెల్బోర్న్: సూపర్ సిరీస్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో కంగారూలు వరల్డ్ ఎలెవన్ జట్టును మట్టి కరిపించారు. వరల్డ్ ఎలెవన్ జట్టుపై ఆస్ట్రేలియా జట్టు 93 పరుగుల భారీ ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేసింది. మూడు నాలుగు క్యాచ్లను వదిలేసినప్పటికీ ఆస్ట్రేలియా వెనుకంజ వేయలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ విజయం వైపు సాగిపోయింది. వరల్డ్ ఎలెవన్ జట్టులో శ్రీలంక బ్యాట్స్మన్ సంగరక్క, ఆల్ రౌండర్ ఫ్లింటాఫ్ తప్ప మరెవరూ రాణించలేకపోయారు. వీరిద్దరు మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏ ఒక్కరూ రెండంకెల స్కోరును సాధించలేకపోయారు.
సంగరక్క 64 పరుగులు చేయగా, ఫ్లింటాఫ్ 38 పరుగులు చేశాడు. సంగరక్కతో పాటు ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత బ్యాట్స్మన్ సెహ్వాగ్ ఆరు పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. రాహుల్ ద్రావిడ్ నాలుగు పరుగులు చేశాడు. చివరలో అక్తర్ భారీ షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. ఆస్ట్రేలియా పెట్టిన 256 పరుగులు లక్ష్యాన్ని ఛేదించడానికి వరల్డ్ ఎలెవన్ నుంచి ఏ సమయంలోనూ ప్రయత్నం జరగలేదు. కేవలం 182 పరుగులకే వరల్డ్ ఎలెవన్ జట్టు ఆల్ అవుట్ అయింది. వాట్సన్ మూడు వికెట్లు తీయగా మెక్గ్రాత్ రెండు వికెట్లు తీశాడు. సైమండ్స్, బ్రెట్లీ, బ్రాకెన్లకు ఒక్కటేసి వికెట్లు దక్కాయి.
టాస్ గెలిచి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాటిచ్, గిల్క్రిస్ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. గిల్క్రిస్ట్ 45 పరుగులు చేయగా, కాటిచ్ 58 పరుగులు చేశాడు. ఆతర్వాత హస్సీ, సైమండ్స్ ఆ ఊపును కొనసాగించారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. విట్టోరి నాలుగు వికెట్లు తీయగా, మురళీథరన్ రెండు వికెట్లు తీశాడు.