రెండు పత్రికల యాజమాన్యాలపైనే నిరసన: వైయస్
తిరుమల: రెండు దినప్రతికల యాజమాన్యాల తీరునే తాము నిరసిస్తున్నామని, జర్నలిస్టులపై తమకు ఏ విధమైన కోపం లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం తిరుమల వచ్చిన డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాత్రి పద్మావతి అతిథి గృహంతో బస చేశారు. బుధవారం ఉదయం మరోసారి తిరుమలేశుని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మంత్రివర్గ విస్తరణపై, ఇతర విషయాలపై తిరుమలలో మాట్లాడటం బాగుండదని ఆయన అన్నారు. అయితే ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, అది వచ్చే నెలలో ఉంటుందో, ఆ పై నెలలో ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. తామే అసలైన తెలంగాణ ప్రతినిధులమని అనిపించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.