అది కాంగ్రెస్ సంస్కృతి, మాది కాదు: నాయని
హైదరాబాద్: కాంగ్రెస్పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు, మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని నాయని నర్సింహారెడ్డి ప్రశంసించారని, ఇప్పుడు విమర్శిస్తున్నారని కాంగ్రెస్ సభ్యుడు డి.యల్. రవీంద్రా రెడ్డి అన్నారు. రవీంద్రారెడ్డి మాటలకు నాయని నర్సింహారెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు.
మంత్రివర్గంలో ఉండి ముఖ్యమంత్రిని విమర్శించడం కాంగ్రెస్ సంస్కృతి అని, అది తమ సంస్కృతి కాదని నాయని నర్సింహారెడ్డి అన్నారు. మంత్రివర్గంలో ఉండి ముఖ్యమంత్రిని తిడతారా అని ఆయన అడిగారు. తెరాస కనుమరగువుతుందని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యకు కూడా ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. కాంగ్రెస్ కనుమరుగవుతుందో, తెరాస కనుమరుగవుతుందో త్వరలోనే తేలుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్వారు రెచ్చగొట్టే పద్ధతి మానుకోవాలని ఆయన అన్నారు.