పోతిరెడ్డిపాడుపై జవాబు దాటవేసే యత్నం: విపక్షాలు
హైదరాబాద్: రాయలసీమకు కృష్ణాజలాలను తరలించే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్పై ప్రభుత్వం సమాధానం దాటవేసే పద్ధతిని అవలంబిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి విమర్శించారు. రాయలసీమ కరువును చూపి సానుభూతి పొందేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కృష్ణా జలాల తరలింపును అడ్డుకోకపోతే రాయలసీమ వారు తెలంగాణపై బాంబులతో దాడులు చేస్తారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 170 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మిగులు జలాల పేరు చెప్పి నికర జలాలను పోతిరెడ్డి హెడ్రెగ్యులేటర్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. కృష్ణా జలాల నికర జలాల కేటాయింపు ఉన్న ఎస్యల్బిసి సొరంగం, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్, వరద కాలువ ప్రాజెక్టులను ముందు పూర్తి చేయాలని, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అసలు జలాలే లేవు, కొసరు జలాల కోసం పొట్లాట పెడుతున్నారని ఆయన అన్నారు.
రాయలసీమ అంటే కడప, కర్నూలు జిల్లాలే అని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అనుకుంటున్నారని, జలాల కేటాయింపులో అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. తెలుగుగంగకు వ్యతిరేకంగా ఎన్.టి. రామారావు ప్రభుత్వ హయాంలో ఆందోళన చేసిన రాజశేఖర్ రెడ్డి ఇప్పుడే పద్దతిలో దాన్ని పూర్తి చేస్తున్నారని ఆయన అడిగారు. తెలుగుగంగకు నికర జలాలు ఇస్తారా, మిగులు జలాలు ఇస్తారా తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాకు దక్కాల్సిన నీటి వాటాను ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు.