సమగ్రాభివృద్ధితోనే నక్సల్స్ ఆటకట్టు: పాటిల్
న్యూఢిల్లీ: సమగ్రాభివృద్ధితోనే నక్సలిజం అంతమవుతుందని కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ అన్నారు. నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న 13 రాష్ట్రాల్లో సమగ్రాభివృద్ధికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి నడుం బిగించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాల డిజిపిల, ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన బుధవారం ప్రసంగించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల వల్ల, ప్రాంతాల మధ్య అసమ అభివృద్ధి వల్ల నక్సలిజం పెచ్చరిల్లుతోందని ఆయన అన్నారు.
దేశ అంతర్గత భద్రతకు నక్సలిజం నుంచి తీవ్రమైన ముప్పు ఉందని, నక్సలిజం అంతానికి ప్రభుత్వం అనుసరిస్తోందని, ఒక వైపు ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ అమలు చేస్తూ మరో వైపు పోలీసుల చర్యను చేపట్టాలనేది ఆ వ్యూహమని ఆయన అన్నారు. ఛత్తీస్ఘడ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్రలలో మావోయిస్టుల వల్ల, ఇతర నక్సల్స్ గ్రూప్ల వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చలను ఆయన ప్రస్తావించారు. నక్సల్స్ గ్రూప్ అడుగుజాడల్లోనే మిగతా వారు నడిచి శాంతికి సహకరిస్తారని ప్రభుత్వం ఆశించిందని, అది మార్గదర్శకం కాగలదని భావించిందని ఆయన అన్నారు. అయితే నక్సల్స్ శాంతి చర్చల నుంచి వైదొలగి హింసాత్మక చర్యలను తిరిగి ప్రారంభించిందని ఆయన అన్నారు. పెచ్చరిల్లుతున్న తీవ్రవాదం పోలీసులకు, పారా మిలటరీ బలగాలకు పెను సవాల్ విసురుతోందనడంలో సందేహం లేదని ఆయన అన్నారు. అమాయకుల హత్యలు జరగుకుండా చూడాలని, అమాయకులపై హత్యాకాండను ఏ ప్రజాస్వామిక ప్రభుత్వం కూడా సహించదని ఆయన అన్నారు.