ఎగువ రాష్ట్రాల అక్రమాలు అడ్డుకుంటాం: పొన్నాల
హైదరాబాద్: గోదావరి, కృష్ణానదులపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అక్రమంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. అందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనకు మంత్రి జవాబు ఇస్తూ ఆ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని చెప్పారు.
కృష్ణానది జలాలనే కాకుండా కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర జలాలు కూడా మన రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటోందని తెలుగుదేశ సభ్యుడు పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక అక్రమాలను అంచనా వేసే యంత్రాంగం కూడా మన వద్ద లేదని తెలుగుదేశం సానా మారుతి అన్నారు. మంత్రి జవాబుకు సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు తీవ్ర విమర్శలకు దిగారు. దానికి ప్రతిగా కాంగ్రెస్ సభ్యులు తెలుగుదేశం పార్టీపై ఎదురుదాడికి దిగారు. మహారాష్ట్ర 11 ప్రాజెక్టులను నిర్మిస్తే రాష్ట్రానికి చుక్క నీరు రాదని, అందువల్ల ఈ విషయంపై సమగ్ర సమాచారం తెప్పించుకోవడానికి ఒక స్వతంత్ర సంస్థను నియోగించాలని లేదా అఖిల పక్ష కమిటీని వేయాలని టి. దేవేందర్ గౌడ్ (తెలుగుదేశం) అన్నారు.