భూకంప పీడితులకు మరో రూ. 500 కోట్లు: పియం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని భూకంప బాధితులకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 500 కోట్ల రూపాయల అదనపు సహాయాన్ని ప్రకటించారు. భూకంప పీడిత ప్రాంతాల్లో పర్యటించడానికి మంగళవారం ఇక్కడికి వచ్చిన ప్రధాని ఆ సహాయాన్ని ప్రకటించారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. పునరావాస చర్యల కోసం ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి 42 కోట్ల రూపాయలు ఇస్తామని రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ ఉత్తర కాశ్మీర్ సరిహద్దులో గల యూరిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని ఆయన పరామర్శించారు. అంతకు ముందు శ్రీనగర్ విమనాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి ముఫ్తి మహ్మద్ సయాద్, కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గులాం నబీ ఆజాద్, సీనియర్ రాష్ట్ర మంత్రులు, అధికారులు స్వాగతం చెప్పారు.
తాంగ్ధార్, యూరిలలో భూకంపానికి మరణించినవారి సంఖ్య వేయి దాటింది. 4,346 మంది గాయపడ్డారు. 32,345 ఇళ్లు ధ్వంసమయ్యాయి.