బీహార్ పోల్స్ తర్వాత కెసిఆర్, నరేంద్ర రాజీనామా
హైదరాబాద్: తమ పార్టీ నేతలు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్ర బీహార్ శాసనసభ ఎన్నికల తర్వాత తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, మాజీ రవాణా శాఖ మంత్రి ఎస్. సంతోషరెడ్డి అన్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణపై ఒక హామీ ఇవ్వవచ్చునని, అలా హామీ ఇవ్వని పక్షంలో కెసిఆర్, నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తారని ఆయన అన్నారు. ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్న తరుణంలో ఆయన మంగళవారంనాడు నరేంద్రను కలుసుకున్నారు.
ముందు రాష్ట్ర మంత్రి వర్గం నుంచి మీరు రాజీనామా చేస్తే కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, ఆ తర్వాత కూడా దిగి రాకపోతే మేం రాజీనామా చేస్తామని కెసిఆర్ తనకు చెప్పారని, ఆ హామీ మేరకు వారు రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మంత్రి పదవులకు కెసిఆర్, నరేంద్ర రాజీనామా చేయాలనే డిమాండ్కు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు.
ఆర్టీసి సమ్మెపై ఎస్మా ప్రయోగం సరైంది కాదని ఆయన అన్నారు. ఇరు వర్గాలు ఒక్కో మెట్టు దిగితే సమస్య పరిష్కారం సాధ్యమేనని ఆయన అన్నారు. ఆర్టీసిని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అనుమానాలకు వీలు కల్పిస్తోందని ఆయన అన్నారు. ఆర్టీసి సమ్మె తలపెట్టడం వల్లనే ఇంతకు ముందు తాను మంత్రి పదవికి రాజీనామా చేయడంలో జాప్యం జరిగిందని ఆయన చెప్పారు.