భయపడే మావోయిస్టులకు డబ్బులు: జానారెడ్డి
మెదక్: కాంట్రాక్టర్లు మావోయిస్టులకు భయపడే డబ్బులిస్తున్నారని, ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ లేదని హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల డబ్బులు మావోయిస్టులకు చేరవేసేవారు పోలీసుల చేతికి చిక్కిన రెండు సంఘటనల నేపథ్యంలో ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. మావోయిస్టులకు విరాళాలు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాంట్రాక్టర్ల డబ్బులు మావోయిస్టులకు చేరడానికి, ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
నీటిపారుదల ప్రాజెక్టులకు, కట్టడాలకు భద్రతను పెంచుతామని ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ డ్యామ్కు పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ లష్కర్ - ఎ - తోయిబా నుంచి ముప్పు ఉందనే సమాచారం రావడంతో భద్రతను పెంచాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 6200 కానిస్టేబుల్ పోస్టులను, 480 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. గిర్గ్లానీకి క్యాబినెట్ హోదా కల్పించాలనేది బిజెపి నాయకుడు విద్యాసాగర్ రావు అభిప్రాయమని ఆయన అన్నారు. ప్రజాసమస్యలపై ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు. గత తప్పిదాలకు తెలుగుదేశం పార్టీ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
