సూర్యపై హన్మకొండ, సిద్ధిపేటల్లో తీవ్ర సానుభూతి
కరీంనగర్: తాలిబాన్ల అమానుషానికి బలైన తెలుగు టెలికాం ఇంజినీర్ సూర్యనారాయణ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. ఆయన తలిదండ్రులు హన్మకొండలో ఉంటున్నారు. పిల్లను ఇచ్చిన మామ విశ్వనాధానిది కరీంనగర్ జిల్లా సిద్దిపేట. సూర్యనారాయణ మరణ వార్తను విన్న వెంటనే హన్మకొండ, సిద్ధిపేటల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అఫ్గానిస్తాన్లో తాలిబన్ల చేతిలో ఆం ధ్ర ఇంజనీర్ సూర్యనారాయణ హత్యకు గురైనట్లు తెలియడంతో సిద్దిపేట పట్టణంలో విషాదం అలుముకున్నాయి. పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి మద్దికర విశ్వనాథంకు సూర్యనారాయణ అల్లుడు కావడంతో పట్టణ ప్రజలను కలచివేసింది. రోబో టెక్నిక్లో విశేష నైపుణ్యం కలిగిన సూర్యనారాయణ మంచి గుర్తింపును సాధించారు. కొద్ది రోజుల క్రితమే ఆయన సిద్దిపేటకు వచ్చి బంధుమిత్రులను కలసివెళ్లారు. ఆదివారం మధ్యాహ్నానికి సూర్యనారాయణ హత్య వార్త తెలియడంతో ఆయన మామ విశ్వనాథం నివసించే ఇంటి వద్ద స్థానికులు గుమిగూడి బాధపడ్డారు.