సోనియాతో వైయస్ భేటీ: పిసిసిపై చర్చ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బుధవారంనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. సోనియాతో ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) కొత్త అధ్యక్షుడి నియామకం గురించి మాట్లాడినట్లు సమాచారం. ఎఐసిసిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకులైనవారికి ఆంధ్రప్రదేశ్ నుంచి స్థానం దక్కిందనే వార్తల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. రాహుల్ గాంధీని వైయస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అంతే కాకుండా తనకు పూర్తి అండదండలు అందిస్తున్న దిగ్విజయ్ సింగ్ ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి పదవి నుంచి తప్పించి వీరప్ప మొయిలీని నియమించారు. ఇది కూడా వైయస్ సోనియాతో భేటీ విషయంలో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర గవర్నరుగా తివారీని వేసినప్పటి నుంచే తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు మొదలు పెట్టిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎఐసిసిలో తెలంగాణకు పూర్తి అనుకూలంగా మాట్లాడుతూ వైయస్ కు కొరకరాని కొయ్యగా మారిన పార్లమెంటు సభ్యుడు మధయాష్కీకి స్థానం కల్పించారు. దీంతో అధిష్ఠానం మనోగతాన్ని తెలుసుకునే అవకాశం కోసం వైయస్ ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమితులైన వీరప్ప మొయిలీని కూడా కలుసుకున్నారు.
సోనియాతో పార్టీ విషయాలు మాట్లాడానని వైయస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. సోనియాతో తాను మాట్లాడిన విషయాలు మీరు అడగకూడదు, నేను చెప్పకూడదని ఆయన మీడియా ప్రతినిధులు వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. రాహుల్ గాంధీని ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్ఠానవర్గం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
