రూ. 2కు కిలో బియ్యం పునరుద్ధరణ వైపు వైయస్
హైదరాబాద్: రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమాయత్తం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన ఆర్థిక శాఖను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ పనితీరును ఆయన శుక్రవారంనాడు సమీక్షించారు. ఈ సమయంలో ఆయన సబ్సిడీ బియ్యం పథకం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న తెల్లకార్డులు, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుకు అయ్యే ఖర్చు గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు చేస్తే ప్రభుత్వంపై అదనంగా 1200 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుందని, దీనివల్ల కోటీ 29 లక్షల మంది లబ్ధి పొందుతారని అధికారులు వివరించారు. దీంతో వెంటనే ముఖ్యమంత్రి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఎన్. టి. రామారావు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం రెండు రూపాయలకు కిలో బియ్యం. ప్రస్తుత తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధికారంలో వచ్చిన తర్వాత ఆ బియ్యం ధరను కిలోకు మూడున్నర రూపాయలకు పెంచారు. ఆ తర్వాత కిలో బియ్యానికి రూ. 5.25 పైసల ధర నిర్ణయించారు. గడువు కన్నా ముందే ఎన్నికలు వస్తాయనడానికి ఇదొక సూచన అంటున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని పునరుద్ధరించేందుకు పూనుకున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
