రోడ్ల మీద ఆగిన ఆటో చక్రాలు
హైదరాబాద్: డిజిటల్ మీటర్లు బిగించుకోవాలనే ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో మంగళవారం ఆటో బంద్ జరుగుతోంది. దీంతో జంటనగరాల్లోని రోడ్లపై మంగళవారం ఆటోలు తిరగలేదు. ఆటోలు లేకపోవడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ రోడ్లలో ట్రాఫిక్ సాఫీగా సాగిపోయింది. మీటర్ ట్యాంపరింగ్ ను అదుపు చేయడానికి ఆటోల్లో డిజిటల్ మీటర్లు పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతే కాకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన రోడ్డు రవాణా సంస్థ అధికారులు కొద్ది రోజులుగా కొన్ని వందల ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. క్రమక్రమంగా ఆటోల స్థానంలో టాక్సీలను ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆటో డ్రైవర్లు మంగళవారం జంటనగరాల్లోని పలు చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. కొత్తపేట చౌరస్తాలో ప్రదర్శన నిర్వహించి రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆటో డ్రైవర్లతో చర్చలకు తావు లేదని మంత్రి కన్నా లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. ప్రజలు డిజిటల్ మీటర్లు బిగించాలనే కోరుకుంటున్నారని, అందువల్ల ప్రభుత్వం వెనక్తి తగ్గే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఆటోల సమ్మె నేపథ్యంలో ఆర్టీసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దాదాపు 222 బస్సులను అదనంగా నడుపుతోంది. సెవెన్ సీటర్ ఆటోలను నగరంలోకి అనుమతిస్తున్నారు.












Click it and Unblock the Notifications