వేషంతో బాబు రైతు కాలేరు: వైయస్
కాకినాడ: రైతు వేషం వేసుకున్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రైతు ప్రతినిధి కాలేరని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ఉదయం కాకినాడలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి, అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రైతు వేసినంత మాత్రాన, తలకు రుమాలు చుట్టినంత మాత్రాన, భుజంపై నాగలి పెట్టుకుని ఫొటోలు దిగినంత మాత్రాన చంద్రబాబు రైతు కాలేరని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ రాష్ట్ర పర్యటనకు వస్తే తాము వ్యవసాయ ఉత్పత్తుల గురించి వివరించామని, చంద్రబాబు హయాంలో క్లింటన్ వచ్చినప్పుడు హైటెక్ మాటలు మాట్లాడారని ఆయన అన్నారు.
రైతుల మేలు కోసం పనిచేసే వారే రైతు ప్రతినిధులు అవుతారని, తాము రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. బలహీన, బడుగు వర్గాలకే ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ కల్లా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని ఆయన చెప్పారు. పేదలకు ఖరీదైన వైద్యం అందించడానికే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. దీని వల్ల కోటీ 80 లక్షల మందికి మేలు కలుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications