పురుషోత్తమరెడ్డిని దూషించలేదు: కాకా
హైదరాబాద్: తాను తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని దూషించలేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి స్పష్టం చేశారు. జి. వెంకటస్వామితో పాటు మిగిలిన కాంగ్రెస్ సీనియర్లు శనివారంనాడు ఢిల్లీ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చారు. పురుషోత్తమరెడ్డిని తాను తెలంగాణ ద్రోహి అనలేదని వెంకటస్వామి మీడియా ప్రతినిధులతో అన్నారు. విషయాలు తెసుకున్న తర్వాత మాట్లాడ్తానని ఆయన చెప్పారు. రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తల గురించి తెలుసుకోవడానికి తాను పురుషోత్తమరెడ్డికి ఫోన్ చేశానని, అహ్మద్ పటేల్ చెప్పినందున భువనగిరి సభను రద్దు చేస్తున్నట్లు తాను ఇక్కడ ప్రకటిస్తానని, మీరు అక్కడ ప్రకటించండని పురుషోత్తమ రెడ్డి తనతో అన్నారని ఆయన వివరించారు.
కాంగ్రెస్ కోర్ కమిటీలో తెలంగాణపై జరగాల్సినంత చర్చ జరగలేదని మరో కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తదుపరి కోర్ కమిటీలో విస్తృతంగా చర్చిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం ఒక కమిటీని వేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తమ మధ్య విభేదాలు ఏం ఉన్నాయో పురుషోత్తమరెడ్డికే తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఈ సాయంత్రం సమావేశమై తదుపరి కార్యక్రమాన్ని ఖరారు చేసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications