కాకాపై పురుషోత్తమరెడ్డి ఆసహనం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి తీరుపై కాంగ్రెస్ సీనియర్ శాసనభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వెంకటస్వామికి చెప్పే తాను భువనగిరి సభ వాయిదా వేస్తున్నట్లు వెల్లడించినట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇప్పుడెందుకు వెంకటస్వామి ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఫోన్ చేయకుండానే ఫోన్ చేసినట్లు చెప్పే తెగువ తనకు ఉంటుందా అని ఆయన అడిగారు. అహ్మద్ పటేల్ ఫోన్ రాగానే తాను ఫోన్ చేద్దామనుకుంటుండగానే వెంకటస్వామి తనకు ఫోన్ చేశారని, విషయం చెప్పానని, సభ రద్దు గురించి వెంకటస్వామి ఢిల్లీలో, తాను హైదరాబాదులో చెప్పాలని అనుకున్నామని ఆయన వివరించారు.
భువనగిరి సభ ఏర్పాట్లలో తాను తలమునకలై ఉన్నాను కాబట్టి అహ్మద్ పటేల్ తనకు ఫోన్ చేసి ఉంటారని ఆయన అన్నారు. తనను తెలంగాణ ద్రోహిగా అభివర్ణించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇందులో లోపాయికారి వ్యవహారాలు ఏమైనా ఉంటే అలా అనవచ్చునని, అటువంటి అవకాశాలేవీ లేవని ఆయన అన్నారు. జరిగే పరిణామాలపై భవిష్యత్తు కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఆకాంక్ష ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల్లో ఉందని, తాము అదే చెప్పుతున్నామని, వారిని బట్టే తమ కార్యక్రమాలు ఉంటాయని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications