మాయావతి పిటిషన్ పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు
National
-Staff
By Staff
న్యూడిల్లీ: అక్రమ ఆస్తుల ఆరోపణలతో సిబీఐ తనపై చేస్తున్న విచారణను సవాలు చేస్తూ మాయావతి పెట్టుకున్న పిటిషన్ మీద సుప్రీంకోర్టు నేడు కేంద్రానికి నోటీసు జారీ చేసింది. జస్టిస్ కె.జి .బాలక్రిష్ణన్ నాయకత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడానికి నిరాకరించి జులై 14 న తదుపరి విచారణకు ఆదేశించింది. మాయావతి పిటిషన్ పై 'సిబిఐ' స్పందనను తెల్పాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 5 2003 లో సుప్రీంకోర్టు 'తాజ్ కారిడార్ స్కామ్' పై విచారణ జరపాల్సిందిగా సిబిఐని ఆదేశించింది. కోర్టు ఆదేశం ప్రకారం 'సిబిఐ' మాయావతి పై 'ఎఫ్ ఐఆర్' నమోదుచేసి విచారణను చేపట్టింది. మూడు సంవత్సరాలు సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో విచారణ కొనసాగింది. 2006 లో సిబిఐ స్టేటస్ రిపోర్టును ప్రక్కన పెట్టి కేసును మూసేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఆగ్రాలోని చారిత్రక కట్టడాల పరిసర ప్రాంతాల్లో ఒక అత్యాధునిక షాపింగ్ మాల్ తో సహా ఇతర అభివృద్ది పనులకై తాజ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టారు. 2001 లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్టు (సిపిసిబి), జర్మన్ సాంకేతిక సహకారంతో ప్రాజెక్టును ప్రారంభించారు. ఆగ్రాలో వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించి ఐదు చారిత్రక కట్టడాల్ని(తాజ్ మహల్, ఆగ్రా కోట, రామ్ బాగ్, ఇత్మదుద్దౌలా సమాధి, చిని కా రౌజా)కాపాడటం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.వాతావరణ మంత్రిత్వశాఖ, పురావస్తుశాఖ(ఎఎస్ ఐ) ల నియమాలతో సంబంధం లేకుండా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వివాదానికి కారణమైంది.2003 జూన్ లో మీడియా పరిశోధనతో ఆ భారీ ప్రాజెక్టులోని లొసుగులన్నీ వెలుగులోకి వచ్చి ప్రాజెక్టు ఆగిపోయింది.