ఉప్పునూతల, దామోదర్ ల కయ్యం
హైదరాబాద్: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మంత్రి ఆర్. దామోదర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆలేరు శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లాజరస్ ఓటమిపై దామోదర్ రెడ్డి ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ లాజరస్ తాజాగా సోమవారంనాడు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ వద్ద ధర్నాకు దిగారు.
ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆలేరు నియోజకవర్గానికి ఇంచార్జీగా వ్యవహరించిన మంత్రి దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉప్పునూతల పురుషోత్తమరెడ్డిని జిల్లాలో తిరగకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. పురుషోత్తమ రెడ్డి అంతు చూస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆయన పురుషోత్తమరెడ్డిని డిమాండ్ చేశారు.
ఆలేరులో లాజరస్ ఓటమికి దామోదర్ రెడ్డి బాధ్యత వహించాలని పురుషోత్తమ రెడ్డి సోమవారంనాడు ఢిల్లీలో అన్నారు. తనను ప్రచారానికి పిలవలేదని ఆయన చెప్పారు. స్థానికేతరులను పిలిచి ప్రచారం చేయించారని ఆయన విమర్శించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం అర్థరహితమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications