బిసిల్లో దేవేందర్ దొర: తలసాని
హైదరాబాద్: వెనకబడిన తరగతుల్లో (బిసిల్లో) దొరలా దేవేందర్ గౌడ్ వ్యవరించడం నిజం కాదా అని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ బిసిలకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తే దేవేందర్ గౌడ్ బిసిల్లో దొరలా వ్యవహరించారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు చుట్టూ తిరుగుతోందని దేవేందర్ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. ఇప్పుడు దేవేందర్ చుట్టూ అందరూ తిరగడం లేదా అని ఆయన అడిగారు.
దేవేందర్ గౌడ్ పార్టీ నుంచి ఎంతో మంది వెళ్లిపోయారని, ఈ విషయంపై దేవేందర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. ఇంద్రారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, మల్ రెడ్డి రంగారెడ్డి, చంద్రశేఖర్ దేవేందర్ వల్లనే పార్టీ నుంచి వెళ్లిపోయారని ఆయన అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పార్టీనుంచి వెళ్లిపోవడం నిజం కాదా అని ఆయన అడిగారు. దేవేందర్ సంకల్పానికి ఇన్నాళ్లు అధికారం అడ్డు వచ్చిందా అని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని కాంగ్రెస్ చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా పట్టుపట్టారు. మీ పార్టీ విషయాలు మీరు చూసుకోవాలని ఆయన వారికి సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications
