ఎల్లంపల్లికి రా!: వైయస్ కు బాబు సవాల్
ఆదిలాబాద్: ధైర్యం వుంటే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఎల్లంపల్లికి వచ్చి నిర్వాసితులకు సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సవాల్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఆయన గురువారం అవినీతి వ్యతిరేక పోరును ప్రారంభించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఎల్లంపల్లికి రాడని, వైయస్ కు ధైర్యం లేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తమ పోరాటం ఆరంభం మాత్రమేనని ఆయన చెప్పారు. పోరాటం చేయాలని, కేసులు పెడితే భయపడవద్దని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తేస్తామని ఆయన ఎల్లంపల్లి నిర్వాసితులతో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి 20, 30 తరాలకు సరిపోయే ధనం సంపాదించారని, పేదల పొట్టలు కొడుతున్నారని ఆయన ఆరోపించారు. నిర్వాసితుల డిమాండ్లు న్యాయమైనవని, వాటిని తీర్చాల్సిందేనని ఆయన అన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టులో అవినీతిపై తాము శాసనసభలో పోరాడామని, ఆ పోరాటం చేసినందుకు తమని సభనుంచి సస్పెండ్ చేశారని ఆయన చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అంచనాలను తొలుత 420 కోట్ల రూపాయలు పెంచారని, ఆ తర్వాత 329 కోట్లు పెంచారని, ఆ విధంగా కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని, తద్వారా ముఖ్యమంత్రి కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో అవినీతిని లోకాయుక్త బయట పెట్టిందని, కాగ్ అవినీతిని తప్పు పట్టిందని, లోకాయుక్త నివేదికను తొక్కిపెట్టిందని ఆయన అన్నారు. మళ్లీ పోరాటం చేస్తే నివేదికను సభలో పెట్టారని, అయితే రికార్డులను తారుమారు చేశారని ఆయన అన్నారు. సిగ్గు లేకుండా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పపడుతోందని ఆయన అన్నారు.
ఎల్లంపల్లికి చేరుకోవడానికి ముందు ఆయన హైదరాబాదు నుంచి ఎపి ఎక్సుప్రెస్సులో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చేరుకున్నారు. మంచిర్యాలలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపిపి) కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు ఎల్లంపల్లికి చేరుకున్నారు. భారీ వర్షంలోనే చంద్రబాబు ఎల్లంపల్లి బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. వారి పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications