సిఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుబాటు
హైదరాబాద్: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు కాంగ్రెస్ శాసనసభ్యుడు దార సాంబయ్య ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై నిప్పులు చెరిగారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష బాధ్యతల నుంచి ముఖ్యమంత్రే తనను తప్పించారని ఆయన నిందించారు. ఈ సంఘటనతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆయన తెలిపారు. ఒంగోలు శాసనసభ్యుడు శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రికి బంధువని, అందుకే శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన చెప్పారు. పార్టీకి రాజీనామా చేసే విషయమై తన వాళ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.
కాంగ్రెసులో, ప్రభుత్వంలో సామాజిక న్యాయం లేదని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ అధిష్ఠానవర్గం వద్ద దళితులకు విలువ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానవర్గం వద్ద దళితులు చేతులు కట్టుకుని నిలబడి అడుక్కునే పరిస్థితే ఉందని ఆయన అన్నారు. దళితులకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దళితులు కాంగ్రెసు పార్టీలో ఇంకా మేకల్లానే ఉన్నారని ఆయన అన్నారు.