తెరాస కోసం వెంపర్లాట లేదు: వైయస్
వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము ఇతర పార్టీల వస్తాయని ఆశపడడం లేదని, ప్రజలు రావాలని ఆశపడుతున్నామని ఆయన అన్నారు. కొన్ని పాకెట్లలో తెలుగుదేశం, తెరాస పొత్తు కాంగ్రెసుకు ఇబ్బందికరంగా ఉంటుందని, పెద్దపల్లి వంటి నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఉందని, అటువంటి ప్రాంతాలకు చెందినవారు తెరాసతో పొత్తు వుండాలని కోరుకోవడంలో తప్పు లేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు చాలా బలంగా ఉన్నామని ఆయన అన్నారు. తమకు 8, 9 శాతం ఓటు పెరిగిందని ఆయన చెప్పారు.
తమ తదుపరి బడ్జెట్ లో కూడా పన్నులు ఉండవని ఆయన చెప్పారు. గత మూడేళ్లుగా అవకాశం ఉన్నా తాము అప్పులు చేయలేదని, ఇప్పుడు చేయబోయే అప్పు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో గ్రేహౌండ్స్ తరహాలో స్పెషల్ స్ట్రయింక్ ఫోర్సును ఉగ్రవాద నిరోధానికి ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు పెద్దగా లేవని ఆయన అన్నారు. సామాజిక న్యాయం తమ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతగా మరో పార్టీలో లేదని ఆయన అన్నారు. బిసి నాయకుడు తమ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని, కమ్యూనిస్టు పార్టీల్లో, ప్రజారాజ్యంలో, తెలుగుదేశం పార్టీలో బిసి నాయకుడు అధ్యక్షుడిగా లేరు కదా అని ఆయన అన్నారు. తమ పార్టీయే సామాజిక న్యాయం గురించి తొలుత ఆలోచించిందని ఆయన అన్నారు.