ఎయిర్ పోర్టులకు ఇ మెయిల్ హెచ్చరిక
లాహోర్: భారతదేశంలోని న్యూఢిల్లీ, చెన్నై, బెంగుళూర్ విమానాశ్రయాలపై ఈ నెల 3, 7 తేదీల మధ్య దాడులు చేస్తామని దక్కన్ ముజాహిదీన్ హెచ్చరించింది. ముంబై దాడులకు తామే బాధ్యులమని ఈ సంస్థ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సౌదీ అరేబియా నుంచి ఇ-మెయిల్ వచ్చినట్లు డైలీ టైమ్స్ వార్తా కథనం. ఆ ఇ-మెయిల్ ఇందిరా గాంధీ విమానాశ్రయం అధికారులకు చేరింది. దీంతో విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబై దాడులకు ముందు దక్కన్ ముజాహిదీన్ పేరు ఎవరికీ తెలియదు. ఆ తర్వాతే అది ముందుకు వచ్చింది. ప్రపంచంలోని నిఘా సంస్థల వద్ద దీనికి సంబంధించిన సమాచారం పెద్దగా లేదు.
ఇదిలా వుంటే, దేశంలో ఉగ్రవాద వైమానిక దాడులు జరిగే ప్రమాదంపై తమకు సమాచారం ఉందని ఎయిర్ చీఫ్ ఫాలీ హోమీ మేజర్ అన్నారు. దేశంలో ఉగ్రవాదులు వైమానిక దాడులు జరిపే ప్రమాదం ఉందని బుధవారంనాడు రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ హెచ్చరించారు. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటరుపై జరిపినట్లు భారతదేశంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపే అవకాశం ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 6లోగా ఈ దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.